యూఎస్ హౌస్లో తాజాగా ప్రవేశ పెట్టిన బిల్లు ఆమోదం పొందితే హెచ్డీ కలిగిన ఉద్యోగులకు హెచ్-1బీ పరిమితి నుండి మినహాయింపు లభిస్తుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ లేదా గణిత శాస్త్రాల్లో అమెరికన్ పీహెచ్డీ పూర్తిచేసిన వారికి మినహాయింపు ఇవ్వాలని బిల్లులో ప్రతిపాదించారు.
ఈ బిల్లు ఆమోదం పొందితే అమెరికాలో పీహెచ్డీ చేస్తున్న విదేశీ విద్యార్థుల్లో అత్యధికులైన భారతీయులకు ఎంతగానో ఉపయోగపడనుంది.స్టాపింగ్ ట్రైయిన్డ్ ఇన్ అమెరికా పీహెచ్డీస్ ఫ్రమ్ లీవింగ్ ది ఎకానమీ (స్టాపిల్) చట్టం కింద ఈ బిల్లును యూఎస్ కాంగ్రెస్ సభ్యులు ఎరిక్ పాల్సెన్, మైక్ క్విగ్లే ప్రవేశపెట్టారు.
‘ప్రపంచవ్యాప్తంగా ఎందరో అమెరికాకు వచ్చి ఉన్నత విద్యలు అభ్యసిస్తున్నారు. వారిని మనం విద్యావంతులుగా చేస్తున్నాం. శిక్షణ ఇస్తున్నాం. వారికి మనం నేర్పిన ప్రతిభను అమెరికా ఎకానమీ కోసం ఉపయోగిస్తే బాగుంటుంది’ అని ఎరిక్ పాల్సెన్ ఈ సందర్భంగా చెప్పారు. ‘విదేశీయులను పంపిస్తే.. అది అమెరికాకే నష్టం’ అని అయన హెచ్చరించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా నిబంధనలను కఠినతరం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ ప్రభావం భారత్పై తీవ్రంగా పడింది. ట్రంప్ దెబ్బతో ఇప్పటికే అనేక ఐటీ కంపెనీలు ఉద్యోగాలకు కోత పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నాయి.
అత్యుత్తమైన నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాల్లో ఎక్కువగా ఖాళీలు ఉంటున్నాయని, అందుకే ప్రతిభావంతులైన విదేశీ విద్యార్థులకు గ్రీన్కార్డులు, లేదా వీసాలు జారీ చేయడం ద్వారా అమెరికా సంస్థలు తమకు అవసరమైన వారిని నియమించుకునే అవకాశం ఇవ్వాలని బిల్లులో పొందుపరిచారు. అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించిన విదేశీయులను బయటకు పంపితే దేశ సాంకేతిక, పరిశోధనలను మరింత అభివృద్ధి పరచుకోలేమని ఈ సందర్భంగా చెప్పారు.