ప్రస్తుతం వాట్సాప్ యూజర్స్ రోజురోజుకీ విపరీతంగా పెరిగిపోతున్నారు. దీంతో కస్టమర్స్ ను ఆకర్షించడానికి సరి కొత్త ఫీచర్స్ ను కూడా తీసుకొస్తుంది ఈ సంస్థ. అందులో భాగంగానే మరో అదిరిపోయే ఆఫర్ తో రానున్నట్టు తెలిసింది.
వాట్సాప్ తన బీటా వెర్షన్ లో తాజాగా ఓ కొత్త సదుపాయాన్ని పరీక్షిస్తోంది. దీని ప్రకారం ఎవరైనా అవతలి వారికి మెసేజ్ పంపిన 5 నిమిషాల తర్వాత అది మాయమైపోతుంది. అయితే అది చేరిన ఐదు నిమిషాలకా? లేదా చదివిన ఐదు నిమిషాలకా? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం వాట్సాప్ వెబ్ వెర్షన్ 0.2.4077 ద్వారా మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. సెట్టింగ్స్లో దీన్ని ఆన్ చేయడం ద్వారా ఈ సౌలభ్యాన్ని పొందొచ్చు.
పంపే సందేశంలోని ఫాంట్లను ఫార్మేట్ చేసుకునేలా కూడా కొత్త సౌలభ్యాన్ని వాట్సాప్ తన బీటా వెర్షన్ 2.17.148లో అందిస్తోంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటే ఎదైనా టైప్ చేశాక దాన్ని సెలక్ట్ చేసుకుని బోల్డ్, ఇటాలిక్ ఫార్మాట్లోకి మార్చడం వీలవుతుంది. మనం పంపే సందేశంలో అత్యవసర విషయాన్ని ఈ సదుపాయం ద్వారా మరింత సమర్థంగా పంపొచ్చు. ప్రస్తుతానికి ఈ ఫీచర్స్ బీటా వెర్షన్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. పూర్తి స్థాయిలో వినియోగదారులకు ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తాయో సమాచారం లేదు.