భారత ప్రధాని నరేంద్ర మోదీకి గత రాత్రి శ్వేతసౌధంలో ఘనస్వాగతం లభించింది. మూడేళ్ల వ్యవధిలో ఐదోసారి అమెరికాలో పర్యటిస్తున్న మోదీకి ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అపూర్వ స్వాగతం పలికారు. శ్వేతసౌధం చేరుకున్న ప్రధాని మోదీని ట్రంప్ తన భార్య మెలానియాతో కలిసి ఎదురెళ్లి మరీ ఆప్యాయంగా ఆహ్వానించారు.
ఇరువురు నేతలు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. మోదీతో భేటీ అనంతరం ట్రంప్ శ్వేతసౌధంలో విందు ఇచ్చారు. ఈ సందర్భంగా శ్వేతసౌధం విశేషాల్ని ట్రంప్ మోదీకి వివరించారు. విందు అనంతరం శ్వేత సౌధం బయటివరకూ వచ్చి ట్రంప్ దంపతులు మోదీకి వీడ్కోలు పలికారు. ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత శ్వేతసౌధంలో ఆతిథ్యం స్వీకరించిన తొలి దేశాధినేత ప్రధాని మోదీ కావడం విశేషం.
"భారత్ మాకు అత్యంత సన్నిహిత దేశం. అత్యున్నత సాంప్రదాయాలు, ఆచారాలు, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ ప్రధానిని శ్వేతసౌధంకు ఆహ్వానించే గౌరవం మాకు దక్కింది" అని ట్రంప్ కొనియాడారు.
సామాజిక మాధ్యమాల్లో తాను, భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ నాయకులమని ట్రంప్ అన్నారు. భారత్ తమకు అత్యంత సన్నిహిత దేశమని పేర్కొన్నారు. భారత్లో పర్యటించాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబసభ్యులను ప్రధాని నరేంద్రమోదీ ఆహ్వానించారు. ఈ సందర్భంగా అబ్రహంలింకన్ తపాలా స్టాంప్ను ట్రంప్కు మోదీ బహూకరించారు.
అబ్రహం లింకన్ జ్ఞాపకార్థం 1965లో భారత ప్రభుత్వం అబ్రహంలింకన్ తపాలా స్టాంప్ను విడుదల చేసింది. వీటితోపాటు హిమాచలి సిల్వర్ బ్రాస్లెట్, కంగ్రా నుంచి తీసుకువచ్చిన టీ పౌడర్, తేనె, జమ్ముకశ్మీర్, హిమాచల్ప్రదేశ్లో చేతితో నేసిన శాలువను ట్రంప్ దంపతులకు బహూకరించారు.
శ్వేతసౌధంలో తనకు ఘన స్వాగతం లభించడం, ప్రెసిడెంట్ ట్రంప్-ఫస్ట్ లేడీ మెలానీయా తనను ఆహ్వానించిన తీరు 125 కోట్ల మంది భారతీయులకు స్వాగతం పలికిన్నట్లుగా ఉందని ప్రధాని మోదీ అన్నారు.