తాజ్మహల్పై బీజేపీ నేతల విమర్శలు, వివాదాస్పద కామెంట్లు కొనసాగుతూనే ఉన్నాయి. అది దేశ ద్రోహులు నిర్మించిన కట్టడం అని ఆ పార్టీ ఎమ్మెల్యే సోమ్ చేసిన కామెంట్స్పై దుమారం ఇంకా సద్దుమణగనే లేదు.. తాజాగా ఎంపీ వినయ్ కతియార్ అలాంటి కామెంట్సే చేశాడు. తాజ్మహల్ నిజానికి ఓ హిందూ దేవాలయం. దాని పేరు తేజోమహల్. అది శివాలయం. షాజహాన్ దానిని కూల్చి తాజ్మహల్ కట్టాడు అని కతియార్ ఓ టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. అక్కడ దేవాలయం ఉన్నది నిజం. అంతమాత్రాన ఇప్పుడు నేను తాజ్మహల్ను కూల్చాలని అనడం లేదు. ఇక సీఎం యోగి ఆదిత్యనాథ్ తాజ్ను సందర్శించినా నాకు అభ్యంతరం లేదు అని కతియార్ చెప్పారు. అయోధ్యలో రామ జన్మభూమి, బాబ్రి మసీదు వివాదంలాగే తాజ్మహల్, తేజోమహాలయపై కూడా చాలా రోజులుగా వివాదం చెలరేగుతూనే ఉన్నది.ఇక అయోధ్యలో రామాలయంపై కూడా కతియార్ స్పందించారు. ఈ కేసులో సుప్రీం సానుకూల తీర్పు ఇస్తుందని ఆశిస్తున్నామని, ఒకవేళ అలా రాకపోయినా తమ దగ్గర వేరే మార్గాలు ఉన్నాయని ఆయన అన్నారు. మందిర నిర్మాణానికి తాము సిద్ధంగా ఉన్నామని, క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.