అమెరికాలో దారుణం జరిగింది. ఫ్లోరిడా లో తెలంగాణ వాసి దారుణ హత్యకు గురయ్యారు. అగ్రరాజ్యంలో మరొక తెలంగాణ వాసిని పొట్టన పెట్టుకున్నారు దుండగులు. ఎన్నో ఆశలు..జీవితంలో లక్ష్యాలు సాధించాలి...అని అనుకుని అమెరికాలో ఉద్యోగం దక్కించుకున్న తెలంగాణ వాసిని కాల్చి చంపేశారు. ఇప్పటికే ఎంతో మంది అక్కడ మత్యువాత పడుతున్నారు. తాజాగా మరొకరిని కాల్చిపడేశారు. ఈ ఘటన ఫ్లోరిడాలో చోటు చేసుకుంది.
కరీంనగర్ జిల్లాకు చెందిన కొత్త గోవర్దన్ రెడ్డి ఏడేళ్ల క్రితం జాబ్ కోసం అమెరికాకు వెళ్లాడు. అక్కడ ఓ డిపార్ట్ మెంట్ స్టోర్లో మేనేజర్గా వర్క్ చేస్తున్నాడు. గుర్తు తెలియని వ్యక్తులు స్టోర్లోకి చొరబడ్డారు. ఆ సమయంలో గోవర్ధన్ రెడ్డితో మరొకరు స్టోర్లో ఉన్నారు. వచ్చిన వారు విచక్షణారహితంగా ఫైరింగ్ ఓపెన్ చేశారు. తూటాలు తగిలి గోవర్దన్ రెడ్డి అక్కడికక్కడనే కుప్పకూలి చనిపోయాడు. మరొక వ్యక్తికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న గోవర్ధన్ రెడ్డి ఫ్యామిలీ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. డెడ్ బాడీని హైదరాబాద్కు రప్పించేందుకు సహాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కుటుంబసభ్యులు కోరుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఐతే ఈ ఘాతుకానికి పాల్పడిన వారు హైవే దొంగలని పోలీసులు అనుమానిస్తున్నారు. గోవర్ధన్ రెడ్డి కి ఎవరితో ఎటువంటి గొడవలు లేవని, ఆయనను చంపాల్సిన అవసరం ఎవరికీ లేదని కుటుంబ సభ్యులు అంటున్నారు. మరో రెండు నెలల్లో ఇంటికి వస్తాడు అనుకుంటే ఇంత దారుణం జరిగిందని ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.