శ్రీలంక వేదికగా మార్చి 6 నుంచి జరగనున్న ముక్కోణపు టీ20 సిరీస్ కోసం 15 మందితో కూడిన భారత జట్టుని సెలక్టర్లు నేడు ప్రకటించారు. కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోని, ఫాస్ట్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకి విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు యువ క్రికెటర్లకి ఎక్కువ అవకాశం కల్పించారు. ఈ ముక్కోణపు టీ20లో భారత్తో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు పోటీపడనున్నాయి.
దక్షిణాఫ్రికా గడ్డపై సుదీర్ఘ సిరీస్ ఆడిన సీనియర్ క్రికెటర్లకి.. త్వరలో ఐపీఎల్ 2018 ఆ తర్వాత ఇంగ్లాండ్ పర్యటన ఉండటంతో విశ్రాంతినివ్వాలని సెలక్టర్లు నిర్ణయించారు. కెప్టెన్ కోహ్లి విరాట్ కోహ్లి స్థానంలో రోహిత్ శర్మ జట్టుని నడిపిస్తాడని, అతనికి సహాయం అందించేందుకు వైస్ కెప్టెన్గా శిఖర్ ధావన్ను ఎంపిక చేశామని సెలక్టర్లు వెల్లడించారు.
ఏడాది తర్వాత పునరాగమనం చేసిన సురేశ్ రైనా దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్లో మెరుగ్గా రాణించి జట్టులో మళ్లీ స్థానం నిలబెట్టుకోగా.. దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్ రూపంలో ఇద్దరు వికెట్ కీపర్లని ధోనీ స్థానంలో సెలక్టర్లు ఎంపిక చేశారు. విశ్రాంతి కావాలని ధోనీనే అడిగినట్లు సెలక్టర్లు చెప్పారు. హైదరాబాద్ ఆటో డ్రైవర్ కుమారుడు మహ్మద్ సిరాజ్ మళ్లీ జట్టులోకి ఎంపికయ్యాడు. మార్చి 18 వరకు ఈ టోర్నీ జరగనుండగా.. ఏప్రిల్ 7 నుంచి ఐపీఎల్ 2018 సీజన్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే.
భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్),
శిఖర్ ధావన్ (వైస్ కెప్టెన్),
కేఎల్ రాహుల్,
సురేశ్ రైనా,
మనీశ్ పాండే,
దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్),
దీపక్ హుడా,
వాషింగ్టన్ సుందర్,
చాహల్,
అక్షర్ పటేల్,
విజయ్ శంకర్,
శార్ధూల్ ఠాకూర్,
జయదేవ్ ఉనద్కత్,
మహ్మద్ సిరాజ్,
రిషబ్ పంత్ (వికెట్ కీపర్)