పనామా గేట్ కుంభకోణంలో పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్షరీఫ్ ను ప్రధాని పదవికి అనర్హుడిగా ప్రకటిస్తూ ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆరుగురు సభ్యుల సంయుక్త దర్యాప్తు బృందం (జిట్) జూలై 10న సమర్పించిన నివేదిక ఆధారంగా పాక్ సర్వోన్నత న్యాయస్థానం నవాజ్షరీఫ్ను దోషిగా తేల్చింది. షరీఫ్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది.
పాక్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 62, 63 ప్రకారం పార్లమెంటులో నిజాయితీగల సభ్యుడిగా కొనసాగేందుకు షరీఫ్కు అర్హత లేదు. ఆయన ఇక ప్రధానిగా కొనసాగడానికి వీల్లేదు అని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పును జస్టిస్ ఇజాజ్ అఫ్జల్ఖాన్ చదివి వినిపించారు. ఇదే కేసులో షరీఫ్తోపాటు ఆయన ఆనుచరుడు, పాకిస్థాన్ ఆర్థిక మంత్రి ఇషాక్దార్ను, జాతీయ అసెంబ్లీ సభ్యుడు, షరీఫ్ అల్లుడు మహమ్మద్ సఫ్దార్లను కూడా సుప్రీంకోర్టు అనర్హులుగా ప్రకటించింది.
షరీఫ్, ఆయన కుమారులు హుస్సేన్, హసన్, కుమార్తె మరియంలపై ఆరువారాల్లోగా అవినీతి అభియోగాలను నమోదు చేసి, ఆరునెలల్లోగా విచారణ పూర్తిచేయాలని నేషనల్ అకౌంటబులిటీ కోర్టును అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడగానే ప్రతిపక్ష తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ కార్యకర్తలు సంబరాలు జరుపుకొన్నారు. షరీఫ్ ప్రధాని పదవి నుంచి తప్పుకొన్నట్లు ఆ దేశ అధికార టీవీ చానల్ పీటీవీ వెల్లడించింది. ప్రభుత్వానికి అభ్యంతరాలున్నప్పటికీ కోర్టు తీర్పును శిరసావహిస్తామని ప్రభుత్వ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు.
పనామా కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో నవాజ్ షరీఫ్ రెండుసార్లు పార్లమెంటులో తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. తన తండ్రి వ్యాపారం ద్వారా సముపార్జించిన ఆస్తుల వల్లే తాను ఈ స్థితిలో ఉన్నానని స్పష్టంచేశారు. అయితే షరీఫ్ తన కుమారులు, కుమార్తె పేరుమీద అక్రమాస్తులు కూడబెట్టారంటూ ఆరోపిస్తూ ప్రతిపక్ష నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారణకు స్వీకరించిన కోర్టు గత మే నెలలో సంయుక్త దర్యాప్తు బృందం (జిట్)ని ఏర్పాటు చేసింది.
షరీఫ్, కుమారులు హసన్, హుస్సేన్, కుమార్తె మరియం జీవనశైలి వారి ఆదాయస్థాయికి మించి ఉన్నదని జూలై 10న జిట్ కోర్టుకు సమగ్ర నివేదికను సమర్పించింది. దీనిని ఆధారాల్లేని అభియోగంగా షరీఫ్ తోసిపుచ్చారు. ర్పును వెలువరించింది.