స్విస్ బ్యాంకులకు భారతీయులు గుడ్బై చెబుతున్నారా..? అంటే అవును అనే అంటున్నారు స్విస్ బ్యాంకు అధికారులు. డిపాజిట్ల గుట్టురట్టు చేసేందుకు రెండు దేశాల మధ్య పెరుగుతున్న నేపథ్యంలో సహకారం అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. దీంతో భారత్కు చెందిన ఘరానా పెద్ద మనుషులు స్విస్ బ్యాంకుల భోషాణాల్లోని తమ డిపాజిట్లను ఇతర సురక్షితమైన దేశాల బ్యాంకులకు తరలిస్తున్నారు.
దీంతో గత ఏడాది ఆ దేశ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు సుమారు రూ.4,500 కోట్లకు పడిపోయాయి. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 45 శాతం తక్కువ. స్విస్ బ్యాంక్ ఖాతాల్లో గతంలో ఎన్నడూ భారతీయుల డిపాజిట్లు ఇంత తక్కువ స్థాయికి పడిపోలేదు. పదేళ్ల క్రితంతో పోలిస్తే ఇపుడు స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్ల విలువ పదో వంతు మాత్రమే ఉన్నట్లు స్విట్జర్లాండ్ కేంద్ర బ్యాంక్ ‘స్విస్ నేషనల్ బ్యాంక్’ (ఎస్ఎన్బి) ఈ వివరాలు వెల్లడించింది. నిన్న మొన్నటి వరకు భారతీయులు విదేశీ బ్యాంకుల్లో దాచే డిపాజిట్లలో ఎక్కువ భాగం స్విస్ బ్యాంకులకే చేరేవి. ఎవరైనా నమ్మకస్తులు లేదా స్విట్జర్లాండ్కు చెందిన వెల్త్ మేనేజర్లు ఈ నిధులను గుట్టుగా నిర్వహించేవారు.
స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు తగ్గడం వరసగా ఇది మూడో సంవత్సరం. నిబంధనలు కఠినం కావడంతో 2007 నుంచే భారతీయు డిపాజిట్లు సింగపూర్, హాంకాంగ్ల్లోని బ్యాంకుల్లో ఎక్కవ డిపాజిట్ అవుతున్నట్లు స్విస్ బ్యాంకులు చెబుతున్నాయి. ఇది ఇలా ఉంటె ప్రస్తుతం స్విస్ బ్యాంకుల్లో భారతీయుల కంటే పొరుగు దేశం పాకిస్థానీలకే ఎక్కువ డిపాజిట్లు ఉన్నాయి. గత ఏడాది చివరి నాటికి భారతీయులకు రూ.4,500 కోట్ల డిపాజిట్లు ఉంటే, పాకిస్థానీల డిపాజిట్ల విలువ రూ.9,500 కోట్లు. 2015తో పోలిస్తే ఇది ఆరు శాతం తక్కువ. 2015లో 16 శాతం పెరిగిన పాకిస్థానీల డిపాజిట్లు 2016లో మాత్రం ఆరు శాతం పడిపోయాయి.