ఐటీ కంపెనీల్లో నియామకాలు తగ్గిపోవడం, వేతన పెంపు ఆగిపోవడంతో ఐటి ఉద్యోగులు అభద్రత ఎదుర్కోవడంతో పాటు, ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉన్న నగరాలలో ఇళ్ల అద్దెలు సహితం తగ్గిపోతూ ఉండడంతో ఇంటి యజమానులు ఇబ్బంది పడుతున్నారు. ఈ రంగంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పుణె, నోయిడా, గుర్గావ్, ఎన్సీఆర్ ప్రాంతాల్లోని ఐటీ హబ్స్లో వచ్చే మూడు క్వార్టర్లలో ఇళ్ల అద్దెలు భారీగా తగ్గిపోయే అవకాశాలున్నాయని ఇండస్ట్రి బాడీ అసోచామ్ అంచనావేస్తోంది.
ఈ తగ్గింపు ఎక్కువగా పుణెలో 20 శాతానికి పైగా ఉంటుందని అధ్యయన రిపోర్టు వెల్లడించింది. '' బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ప్రాంతాల్లో మున్నుందు కాలంలో ఇళ్ల అద్దెలు 10-15 శాతం తగ్గిపోనున్నాయి. పుణేలో ఎక్కువగా 20 శాతం పైగా తగ్గనున్నాయి. అదేవిధంగా గుర్గావ్, నోయిడాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంటోంది'' అని అసోచామ్ పేర్కొంది. బెంగళూరులోని హౌజ్ ఓనర్లకు సిలికాన్ వ్యాలీకి ఉన్నంత పేరు ఉంది. అద్దెళ్లను తగ్గిస్తూ మంచి సౌకర్యాలతో టెనంట్లను ఆకట్టుకుంటున్నామని వారు చెబుతున్నారు.
మంచి ఆప్షన్లతో అద్దెదారులకు అనుకూలంగా మార్కెట్ ఉందని, ముఖ్యంగా నెలకు రూ.50వేల కంటే ఎక్కువగా చెల్లించే వారికి అన్ని రకాల సదుపాయాలు అందిస్తున్నామని ఇంటి యజమానులు చెప్పినట్టు తెలిపింది. ముందుకాలంలో ప్రతేడాది వేలకొద్దీ ఉద్యోగులను ఐటీ సంస్థలు నియమించుకునేవి. ఆ నియామకాల ప్రక్రియకు అనుగుణంగానే బెంగళూరులో అద్దె ఇళ్లకు డిమాండ్ భారీగా పెరిగేది.
కానీ ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. 30 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న ఐటీ, ఐటీ ఎనాబుల్ సర్వీసుల ప్రొఫిషినల్స్ వేతనం సగటున వార్షికంగా 20 లక్షల నుంచి 50 లక్షల మధ్యలో ఉంటే, వారు అద్దెలు రూ.50వేల నుంచి రూ.1.5 లక్షల వరకు చెల్లిస్తున్నారని ఈ అధ్యయనం తెలిపింది. రూ.15 వేల నుంచి రూ.35వేల మధ్యలో కూడా అద్దెలు ఉన్నాయని చెప్పారు. ఈ అన్ని సెగ్మెంట్లలో అద్దెలు తగ్గిపోయే అవకాశాలున్నాయని అధ్యయన రిపోర్టు చెప్పింది.