భారత్, రష్యాల త్రివిధ దళాలు తొలిసారిగా నిర్వహిస్తున్న సంయుక్త సైనిక విన్యాసాలు ప్రారంభమయ్యాయి. ఇరు దేశాల సైన్యాల మధ్య నిర్వాహక సమన్వయాన్ని పెంపొందించుకోవాలన్న లక్ష్యంతో.. 'ఇంద్ర' పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమం రష్యాలోని వ్లాడివోస్టోక్లో శుక్రవారం మొదలైంది. భారత్, రష్యాల సైన్యాలు, నావికాదళాలు, వైమానికదళాల మధ్య విడివిడిగా సంయుక్త విన్యాసాలు జరుగుతున్నప్పటికీ.. మూడు దళాలు కలిసి విన్యాసాల్లో పాల్గొనడం ఇదే మొదటిసారి. ఆరంభ కార్యక్రమంలో ఇరు పక్షాల సేనలు కవాతు నిర్వహించాయి. భారత సైనికులు సంప్రదాయ యుద్ధ క్రీడ నైపుణ్యాలను ప్రదర్శించారు. 10 రోజులపాటు ఈ విన్యాసాలు సాగనున్నాయి.
భారత బృందంలో 450 మంది సిబ్బంది.. రష్యా తరఫున 1000 మంది సిబ్బంది వీటిలో పాల్గొంటున్నారు. ఉమ్మడి సవాళ్లను అధిగమించడంలో ఇరు దేశాల నిబద్ధతను ఈ విన్యాసాలు చాటిచెప్తాయని భారత రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది. భారత్, రష్యాల మధ్య కొనసాగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్య సంబంధాలకు ఇవి అద్దం పడతాయని ప్రారంభోత్సవ ప్రసంగంలో భారతీయ కార్యదళం కమాండర్ మేజర్ జనరల్ ఎన్డీ ప్రసాద్ వ్యాఖ్యానించారు.
ఈ విన్యాసాలతో ఇరు దేశాల సైన్యాల మధ్య బంధం మరింత బలపడుతుందని రష్యా సైనిక ఉన్నతాధికారి లెఫ్టినెంట్ జనరల్ సోలోమాటిన్ వ్యాఖ్యానించారు. ఇరు దేశాల దౌత్య బంధం 70వ వార్షికోత్సవం సందర్భంగా ఇదొక కీలకమైన మైలురాయి అని త్రివిధ దళాల బృంద పరిశీలకుడు లెఫ్టినెంట్ జనరల్ జేఎస్ నేగి అన్నారు. గత జూన్లో రష్యాలో భారత ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా.. సైనిక వస్తువులు, సామగ్రికి సంబంధించి తయారీ, ఉత్పత్తి, అభివృద్ధిలో భాగస్వామ్యం వహించడం ద్వారా రక్షణ సహకారాన్ని మరింత పెంచుకోవాలని రెండు దేశాలూ నిర్ణయానికి వచ్చిన సంగతి తెలిసిందే.