అనంతలోకాలకి వెళ్ళిన అందాల తార శ్రీదేవి మరణం సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మని ఎంతగా కలిచి వేస్తుందో ఆయన రోజు చేస్తున్న ట్వీట్స్ని బట్టి తెలుస్తుంది. మొన్నటికి మొన్న ఓ వ్యాసంగా క్షణం క్షణం టైంలో జరిగిన విషయాలని వివరించిన వర్మ తాజాగా శ్రీదేవి అభిమానులకి ప్రేమ లేఖ రాశాడు.
శ్రీదేవి అందచందాలు మాత్రమే బయటకి కనిపిస్తాయి. కాని ఆమె జీవితంలో ఎన్ని విదారక సంఘటనలు ఉన్నాయి అనేది గోవిందా గోవిందా, క్షణక్షణం టైంలో తెలుసుకున్నాను అని వర్మ తన లేఖ ద్వారా తెలియజేశాడు. శ్రీదేవి జీవితం ఓ అద్భుతం. అందం, టాలెంట్, మంచి ఫ్యామిలీ ఉన్న శ్రీదేవిని బయట నుండి చూసేవారికి మిరాకిల్గానే అనిపిస్తుంది. ఆమె జీవితం ఏంటనేది శ్రీదేవిని కలిసిన తర్వాత తెలుసుకున్నాను.
తండ్రి మరణించనంత వరకు స్వేచ్చగా ఉన్న శ్రీదేవి, ఆమె తల్లిదండ్రుల మరణం తర్వాత పంజరంలో ఉన్న పక్షిలా మారింది. ఆ రోజులలో శ్రీదేవి తండ్రి బ్లాక్ మనీకి ట్యాక్స్ పడుతుందేమోన్న ఉద్దేశంతో ఫ్రెండ్స్, బంధువుల దగ్గర దాచిపెట్టాడు. నమ్మిన వాళ్ళందరు శ్రీదేవి తండ్రిని మోసం చేశారు. ఇక శ్రీదేవి వాళ్ళ అమ్మ వివాదాలలో ఉండే భూమికి పెట్టుబడులు పెట్టి మోసపోయింది.
శ్రీదేవి సోదరి శ్రీలత పక్కింటి కుర్రాడిని వివాహం చేసుకొని వెళ్లింది. తనకి ఆస్తిలో వాటా కావాలని శ్రీలత కేసు వేయడంతో శ్రీదేవి తన ఆస్తుల్నింటిని రాసిచ్చేసింది. ఈ పరిస్థితులలో శ్రీదేవి ఒక దశలో చేతిలో చిల్లిగవ్వ లేని స్థితికి చేరుకుంది. ఆ సమయంలో బోని కపూర్ శ్రీదేవిని చేరదీసి ఆమెని పెళ్ళి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత కూడా శ్రీదేవి అంత సంతోషంగా లేదని, బోని మొదటి భార్య మోనా నుండి విడగొట్టిన కారణంగా బోని తల్లి శ్రీదేవిపై చేయి కూడా చేసుకుంది.
అందం కాపాడుకునేందుకు శ్రీదేవి కాస్మోటిక్ సర్జరీలు చేయించుకుంది. దాని ప్రభావం గత ఐదారేళ్ళలో శ్రీదేవిని చూసిన వాళ్ళకి స్పష్టంగా తెలుస్తుంది. కొన్నేళ్ళుగా శ్రీదేవి ఎక్కువగా తన కూతుళ్ళ కెరీర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ గడిపింది. మొత్తంగా శ్రీదేవి తన జీవితాంతం అశాంతి మధ్యనే బతికింది. చనిపోయిన తర్వాత అయిన ఆమె ఆత్మకి శాంతి లభిస్తుందని ఆశిస్తున్నానంటూ వర్మ తన లేఖలో పేర్కొన్నాడు.