హెచ్చరికలను ఖాతరు చేయకుండా ఉత్తర కొరియా మళ్లీ మిస్సైల్ ఫైర్ చేసి కవ్వింపు చర్యలకు కాలుదువ్వుతున్నది. ఈ సారి ఏకంగా జపాన్ దీవి మీద నుంచి ఆ మిస్సైల్ను పరీక్షించింది. ఈ ఘటన పట్ల జపాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉత్తర కొరియా వల్ల జపాన్కు తీవ్ర ప్రమాదం ఉందని ఆ దేశ ప్రధాని షింజో అబే ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు.
మంగళవారం ఉదయం 6 గంటలకు ఈ ప్రయోగం జరిగినట్లు తెలుస్తున్నది. జపాన్కు చెందిన హొక్కైడో దీవి మీద నుంచి మిస్సైల్ వెళ్లినట్లు తెలుస్తున్నది. ఈ ప్రయోగం నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి హుటాహుటిన ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. నిజానికి ఇటీవల ఉత్తర కొరియా పదేపదే క్షిపణులను పరీక్షిస్తూనే ఉన్నది. కానీ జపాన్ దీవి మీదుగా ప్రొజెక్టల్స్ను పరీక్షించడం చాలా అరుదని చెప్పవచ్చు.
ఈ దుశ్చర్యతో ఆ ప్రాంతంలోఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉత్తర కొరియా గతంలోనూ జపాన్ మీదగా రాకెట్లను ఫైర్ చేసింది. 1998, 2009 సంవత్సరాల్లోనూ ఇలా జరిగినట్లు అనుమానిస్తున్నారు. అయితే అవి ఆయుధాలు కాదు, శాటిలైట్ ప్రయోగాలు అని ఉత్తర కొరియా సర్ది చెప్పుకొంది. ప్రస్తుతం ఉత్తర కొరియా మిస్సైల్ను పరీక్షించిన నేపథ్యంలో ప్రజలంతా షెల్టర్ తీసుకోవాలని జపాన్ ప్రకటన చేసింది.
కొరియా ప్రయోగించిన మిస్సైల్ సుమారు 2700 కిలోమీటర్లు ప్రయాణించినట్లు తెలుస్తున్నది. 550 కిలోమీటర్ల ఆల్టిట్యూడ్లో మిస్సైల్ వెళ్లినట్లు అంచనా వేస్తున్నారు. జపాన్ తీరంలో క్షిపణి మూడు ముక్కలై పడినట్లు భావిస్తున్నారు. అయితే ఆ మిస్సైల్ను షూట్ చేయాలన్న ప్రయత్నాలకు జపాన్ వెళ్లలేదు. ప్రస్తుతం హొక్కైడాలోనే జపాన్, అమెరికాకు చెందిన దళాలు సైనిక విన్యాసాలు చేస్తున్నాయి.
ఇలా ఉండగా, ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలపై రష్యా డిప్యూటీ విదేశాంగ మంత్రి సెర్గె ర్యాబ్కో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్షిపణి ప్రయోగాన్ని రష్యా ఖండిస్తుందని సెర్గె ర్యాబ్కో స్పష్టం చేశారు. ఉత్తర కొరియా దూకుడును చూస్తే తమకు చాలా ఆందోళనగా ఉందని ఆయన పేర్కొన్నారు.