దేశం ఇప్పుడిప్పుడే 4జీ వైపు మరలుతున్న సంగతి తెలిసిందే. కాగా ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్, మరో ప్రయివేటు దిగ్గజ ఆపరేటర్ భారతీ ఎయిర్టెల్ సంస్థలు మరో అడుగు ముందుకు వేసి అంతకంటే వేగమైన 5జీని తీసుకురావడానికి ప్రణాళికలు వేస్తోన్నాయి.
భారత్లో 5జీ సేవలు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్, నోకియాలు చేతులు కలిపాయి.
ఈ అంశంపై ఇటీవలే నోకియా ప్రతినిధులు మాట్లాడుతూ... 5జీ సేవలను ప్రారంభించడమే తమ టార్గెటని తెలిపారు. తాజాగా ఇందుకు సంబంధించి ఈ మూడు కంపెనీలు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీంతో దేశంలో అత్యధిక వేగంతో వైర్లెస్ బ్రాడ్బాండ్ సర్వీసుని అందించే క్రమంలో ప్రయత్నాలు జరగనున్నాయి. ఈ ఒప్పందం ప్రధానంగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, స్మార్ట్ సిటీ, డిజిటల్ ఇండియాలకు మరింత ఉపయోగకరం.
5జీ ఎకో సిస్టమ్ను అభివృద్ధి చేయడానికి బీఎస్ఎన్ఎల్తో కలిసి పనిచేయనున్నట్లు నోకియా ప్రతినిధులు చెప్పారు. ఈ మేరకు ఇరు కంపెనీలు దేశవ్యాప్తంగా ప్రదర్శనలు కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు.