సిక్కిం వద్ద భారత్ - చైనా సరిహద్దుల్లో ఇరు దేశాల సైన్యాలు కయ్యానికి కాలు దువ్వుతూ, పరస్పరం రెచ్చగొట్టుకొంటూ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా హాంబర్గ్ లో మాత్రం రెండు దేశాధినేతలు పరస్పరం కరచాలనం చేసుకోవడం, పొగడ్తలతో ముంచేత్తుతూ ఉండటం, ముచ్చట్లు చెప్పుకోవడం విస్మయం కలిగిస్తున్నది.
జీ 20 సదస్సులో పాల్గొన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ల కలయిక ఇరు దేశాల సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు దృష్ట్యా అంతర్జాతీయంగా తీవ్ర ఆసక్తి కలిగించాయి. రెండు దేశాల సరిహద్దుల్లో పరిస్థితులు సవ్యంగానే ఉన్నట్లు వారి ముఖకవళికలు కనిపించాయి.
తొలుత మాట్లాడిన ప్రధాని మోదీ చైనా నాయకత్వంలో బ్రిక్స్ నిర్వహణను అభినందించారు. అంతేగాక, ఈ ఏడాది చివర్లో చైనాలోని జియామెన్లో నిర్వహించే బ్రిక్స్ సదస్సుకు భారత్ పూర్తి మద్దతిస్తుందని తెలిపారు.
ఆ తర్వాత చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మాట్లాడుతూ ఉగ్రవాదంపై భారత్ పోరును ప్రశంసించారు. అంతేగాక ఆర్థిక, సామాజిక రంగాల్లో అభివృద్ధిని మెచ్చుకున్నారు. మున్ముందు కూడా మరింత వృద్ధి సాధించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. సమావేశం అనంతరం ఇరుదేశాధినేతలు కరచాలనం చేసుకొని కాసేపు ముచ్చటించుకున్నారు.
రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు మోదీ, జిన్పింగ్లతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్, బ్రిటన్ ప్రధాని థెరిసా మే, జపాన్ ప్రధాని షింజో అబే, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మేక్రాన్ తదితర ప్రపంచ నేతలు హాజరయ్యారు. వీరికి జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ సాదర స్వాగతం పలికారు.