ఇప్పుడు ఉన్న రాజకీయ నేపథ్యంలో ఉత్తరాది ప్రజలకి దక్షిణాది ప్రజలంటే చిన్నచూపు. ఈ నేపధ్యంలో కేంద్రంలోని భాజపా ఓ మాస్టర్ స్కెచ్ గీసినట్లు తెలుస్తోంది. దక్షిణాదికి అత్యంత ప్రాముఖ్యతనిచ్చే పనిని చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇది కనుక నిజమే అయితే అటు దక్షిణాది మొత్తం ఒక్కసారిగా ప్రధానమంత్రి మోదీ కి జై అనడం ఖాయం. ఇంతకీ భాజపా వేస్తున్న మాస్టర్ ప్లాన్ ఏంటయా అంటే, దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ కు భారత రాష్ట్రపతి పదవి కట్టబెట్టడమేనట. ప్రస్తుతం ఈ వార్త సామాజిక నెట్వర్కింగ్ సైట్లలో చక్కెర్లుకొడుతుంది. ఇప్పటికే బాబ్రీ కేసులో ఇరుక్కున్న ఎల్.కె అద్వానీ రాష్ట్రపతి రేసులో లేడు, అంతేకాదు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ పేరు కూడా ఈ పదవికి వినబడింది, కానీ ఆ తర్వాత అంతగా చర్చ జరగలేదు అనుకోండి. కానీ ఇప్పుడు రజినీకాంత్ పేరు ప్రముఖంగా వినబడటం విశేషం.
బీజేపీ ప్రభుత్వం రజినీకాంత్ ని ఎందుకు ఎంచుకుందంటే? రజినీకాంత్ వివాదాలకు దూరంగా వుండటమే కాకుండా దేశ వ్యాప్తంగా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. పైగా నరేంద్ర మోదీ కూడా ఆయనను రాష్ట్రపతి పదవికి ఎంపిక చేసేందుకు ఇష్టతను ప్రదర్శిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు రాష్ట్రపతి ఎన్నికల్లో తమిళనాడు ప్రజల ఓట్లు ఎంతో కీలకం కానున్నాయి. కాబట్టి రజీనీకాంత్ కు పదవి కట్టబెట్టడం ద్వారా దక్షిణాదిలో భాజపా పాగా వేసేందుకు మంచి అవకాశం కుదురుతుందని అనుకుంటున్నారు. ఏది ఏమైనా మోదీ ప్రభుత్వం ఎప్పుడు ఈ సంచలన నిర్ణయం తీసుకుంటుందో ఎవరు అంచనా వేయలేరు.చూద్దాం బీజేపీ రాష్ట్రపతి విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో.