అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దెబ్బకు భారతీయ ఐటీ కంపెనీలు, ఐటీ ఉద్యోగులు తల్లడిల్లుతున్నారు. దాదాపు అన్ని సంస్థలు తమ ఉద్యోగులను గణనీయంగా తగ్గించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులందరూ ఎవరికి ఎప్పుడు పింక్ స్లిప్ వస్తుందో అన్న భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్ బాటలోనే ఇప్పుడు టెక్ మహీంద్ర కూడా అడుగువేసింది.
ఈ ఒక్క నెలలోనే వెయ్యి మందిని ఈ సంస్థ తీసేసింది అయితే, ఇది రెగ్యులర్గా జరిగే పనేనని,పనితీరు ఆశించినంతగా లేని ఉద్యోగులను తొలగించడం సర్వసాధారణమైన విషయమన్నారు. ప్రధానంగా 10 నుంచి 15 సంవత్సరాల అనుభవం ఉన్న ఉద్యోగులనే కంపెనీలు టార్గెట్ చేస్తున్నాయి. ఏదో ఒక కారణం చూపి వీరిని తప్పించే ప్రయత్నం చేస్తున్నాయి. అలాగే, మరో టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ కూడా ఇదే తరహా ప్రకటన చేసింది. తమ కంపెనీలో పని చేసే ఉద్యోగుల్లో ప్రతిభ లేనివారిని తీసేయనున్నట్టు ప్రకటించింది. 'వరుసగా కొంతకాలంపాటు మంచి పనితీరు కనబరచనివారిపై చర్యలు తీసుకోనున్నాం. ఇందులో భాగంగా కొందరిని తొలగించే అవకాశమూ ఉంది' అని ఆ ప్రకటనలో స్పష్టంచేసింది.
అంతేకాదు ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల వచ్చే 3-4 ఏళ్లలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు కోటి ఉద్యోగాలు గల్లంతవుతాయని ప్రపంచ ఆర్థిక వేదిక హెచ్చరిస్తోంది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగాల్లో సగం ఉద్యోగాలు కనుమరుగవుతాయని వెల్లడించింది. ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, త్రీడీ ప్రింటింగ్, అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థల వల్ల ఇప్పుడున్న చాలా ఉద్యోగాలు 2020కి కనుమరుగవుతాయని పేర్కొంది.