ప్రపంచ క్రికెట్ క్రీడాభిమానులకు సంతోషం కలిగించే వార్త. 2022లో జరిగే కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్ నూ చేర్చవచ్చని తెలుస్తోంది. కామన్వెల్త్ క్రీడలు నిర్వహించేందుకు బిడ్ వేయాల్సిందిగా బ్రిటన్ సర్కారు బర్మింగ్ హామ్ ను ఆహ్వానించింది. ముందు ఈ హక్కులను దక్షిణాఫ్రికాలోని డర్బన్ దక్కించుకున్నది, కానీ రాజకీయ, ఆర్థిక కారణాలతో వెనక్కు తగ్గింది. డర్బన్ షెడ్యూల్ లో ఇప్పటికే మహిళల క్రికెట్ అంశముంది.
ఆతిథ్య హక్కులు దక్కితే పురుషుల క్రికెట్నూ చేర్చాలని భావిస్తున్నట్లు వార్విక్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి, బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్ బిడ్ కంపెనీ సభ్యుడు నీల్ స్నోబాల్ చెప్పాడు. హక్కులు వస్తే టీ20 ఫార్మాట్లో టోర్నీని నిర్వహిస్తామని వెల్లడించారు. అయితే కెనడా, మలేసియా, ఆస్ట్రేలియాల్లోని నగరాలు కూడా 2022 కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య హక్కుల కోసం ప్రయత్నిస్తాయని భావిస్తున్నారు. 1998లో మలేసియాలో జరిగిన కామన్వెల్త్ క్రీడల పోటీల్లో క్రికెట్ కు అవకాశం కల్పించారు.