గతంలో గ్రహాంతర వాసుల జోలికి వెళ్లడం ప్రపంచానికే ప్రమాదకరం అని సుప్రసిద్ధ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ హెచ్చరించిన సంగతి తెలిసిందే.
అయితే వీటిని ఏమాత్రం పట్టించుకోని చైనా ఏలియన్స్ తో మాట్లాడేందుకు అతిపెద్ద రేడియో డిష్ ను సిద్ధం చేస్తోంది. 500 మీటర్ల గోళాకార టెలిస్కోప్ కలిగిన ఈ రేడియో డిష్ ఖగోళంలోని సూదూర ప్రాంతాలకు సిగ్నల్స్ను పంపగలదని తెలుస్తోంది. దీని ద్వారా సిగ్నల్స్ ను పంపడం ద్వారా సుదూర పాలపుంతల్లోని ఏలియన్స్ ఉనికిని తెలుసుకునే వెసులుబాటు ఉంటుందని చైనా భావిస్తోంది.
ఇప్పటికే అంతరిక్ష ప్రయోగాలతో అగ్రదేశాలకు సవాలు విసురుతున్న చైనా, ఇందుకోసం వందల కోట్ల రూపాయలను ఖర్చుచేయనుంది. అయితే దీనిపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలియన్స్ మనిషికంటే తెలివైనవని, వాటితో ప్రపంచానికి ముప్పు ఏర్పడవచ్చని వారు ఆందోళన చెందుతున్నారు.
అయితే చైనా సాహసాన్ని కూడా పలువురు శాస్త్రవేత్తలు స్వాగతిస్తున్నారు. మనిషికి తోడుగా మరోజీవి ఉందన్న విషయం నిర్ధారణ అవుతుందని వారు పేర్కొంటున్నారు.