తమిళనాడు ప్రభుత్వ విధానాలపై వ్యంగ్య కార్టూన్ వేసి అరెస్టయిన బాలక్రిష్ణన్ కు తిరువనేలి జిల్లా కోర్టు సోమవారం మధ్యాహ్నం బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో బయటకు వచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నేనేం ఘోర హత్యలు చేయలేదు. కాబట్టి, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. కేసులతో నన్నేం చేయలేరు. ప్రభుత్వ అసమర్థతను ఎండగట్టడం నేను ఆపను. నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది’’ అని కోర్టు వెలుపల బాల ప్రకటించారు. తిరునల్వేలి కలెక్టర్ కార్యాలయం ఎదుట ఓ కుటుంబం సజీవంగా కాల్చుకుని ఆత్మహత్య చేసుకోగా.. వడ్డీ వ్యాపారుల ఆగడాలను అడ్డుకోవటంలో ప్రభుత్వం, అధికారులు ఘోరంగా విఫలమవుతున్నారన్న విమర్శల నేపథ్యంలో బాల కార్టూన్ వేశాడు. దాంతో ప్రభుత్వం అతన్ని అరెస్టు చేసింది.