భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల దృష్ట్యా ఈ నెల 24 నుండి హైదరాబాద్లో జరుగనున్న 16 దేశాల ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య (ఆర్సిఇపి) సమావేశం మాటలకే పరిమితం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక్కడ ఖరారు కాగలదని ఆశిస్తున్న మెగా ఆసియా వాణిజ్య ఒప్పందం ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఒప్పందం విషయంలో భారత్ వైఖరిపై ఈ ఉద్రిక్తతల ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఐదు రోజులపాటు జరిగే ఈ సమావేశాన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించనున్నారు. భారత్తోపాటు చైనా, బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, మలేషియా, మయన్మార్, సింగపూర్, థాయిలాండ్, ఫిలిప్పీన్స్, లావోస్, వియత్నాం, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలకు చెందిన 700 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతున్నారు.
వస్తు, సేవల వాణిజ్య నిబంధనల సరళతరం, పెట్టుబడుల ప్రోత్సాహమే లక్ష్యంగా ఈ సమావేశం జరుగుతున్నది. అయితే సరిహద్దులో చైనా దూకుడుపై భారత్ తీవ్ర అసంతృప్తితో ఉంది. ఇప్పటికే చైనా ఉత్పత్తులను కొనరాదన్న ప్రచారం దేశంలో ఎక్కువైంది. 130 కోట్లకుపైగా జనాభా కలిగిన భారత మార్కెట్ ప్రపంచ దేశాలకు అత్యంత కీలకం. చైనా కూడా భారతీయ మార్కెట్నే నమ్ముకుని ఉత్పాదకతను పెంచుకుంటోంది.
ఈ క్రమంలో ఈ ఒప్పందం భారత్తోపాటు ఇతర దేశాల కంటే చైనాకే చాలా అవసరం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చైనా ఆర్థిక వ్యవస్థది రెండో స్థానం. మొదటి స్థానంలో ఉన్న అమెరికాను వెనక్కి నెట్టేయాలని చైనా ఎప్పట్నుంచో ఎదురుచూస్తోంది. దానికి ఈ ఒప్పందం కొండంత బలం చేకూర్చనుంది. దీంతో ఈ ఒప్పందానికి ఒప్పుకోకుండా చైనాపై భారత్ ఒత్తిడి తీసుకురావచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే భారత జిడిపిలో సేవా రంగం వాటా 50 శాతానికిపైనే ఉంది. దేశంలో పలు సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఇది మరింత పెరగడం ఎంతో ప్రధానం. పెరగాలంటే ఈ ఒప్పందం సఫలం కావాల్సి ఉందన్న వాదనలూ వినిపిస్తున్నాయి. దీంతో చైనాతో సరిహద్దు సమస్యలను పక్కనబెట్టి భారత్ ముందుకు వెళ్లాలనే వత్తిడులు ప్రభుత్వంపై పెరుగుతున్నాయి.