పుల్వామా ఉగ్రదాడిపై అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ దాడిని ఆయన ఖండించారు. భారత్కు చెందిన 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు దాడిలో చనిపోవడం తాను కళ్లారా చూశానని ట్రంప్ అన్నారు. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు తమ పాలనావ్యవస్థ మొత్తం భారత్కు సహకరిస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు. పుల్వామా ఉగ్రదాడితో భారత్-పాక్ మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో భారత్ చాలా బలంగా ఉందని, ఉగ్రవాదాన్ని పోత్సహించడం పాకిస్తాన్కు సరైన పద్ధతి కాదని ట్రంప్ పేర్కొన్నారు. పరిస్థితిని సద్దుమనిగించేందుకు ఇరుదేశాలతో చర్చిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు.
పుల్వామా దాడిని భయానక చర్యగా అభివర్ణిస్తూ పాకిస్తాన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి పాక్ వైఖరిపై పైర్ అయ్యారు. పాకిస్తాన్.. ఉగ్రవాదాన్ని పోత్రహించడం క్షమించరాని నేరం అని అన్నారు. అమెరికా ఇస్తున్న నిధులను పాక్ దుర్వినియోగం చేస్తోందని ట్రంప్ మండిపడ్డారు. పుల్వామా దాడితో భారత్-పాక్ రెండు దేశాల మధ్య ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని చెప్పారు.
ఫిబ్రవరి 14వ తేదీన జమ్మూకాశ్మీర్ పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లు టార్గెట్గా ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో 40మంది జవాన్లు అమరులయ్యారు. ఆత్మాహుతి దాడి చేసింది తామేనని జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. ఈ ఉగ్రవాద సంస్థ పాకిస్తాన్ కేంద్రంగా పని చేస్తోంది. దీని చీఫ్ మసూద్ అజార్.. భారత్కు వ్యతిరేకంగా స్థానిక యువకుల్లో విద్వేషం నింపి వారిని టెర్రరిస్టులుగా మార్చి భారత్పైకి వదులుతున్నాడు. పాక్ కేంద్రంగా భారత్లో ముష్కర దాడులకు కుట్రలు చేస్తున్నాడు. ఇంత జరుగుతున్నా.. పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం మాకేమీ తెలీదు అన్నట్టు వ్యవహరిస్తోంది. ఒక పక్క ప్రపంచ దేశాలు కూడా చాలా వరకు భారతదేశానికి మద్దతు ప్రకటిస్తూ ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని సూచిస్తున్నాయి. తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సైతం భారతదేశం ఎంత పటిష్టంగా ఉందో తెలియజేశాయి.