సిరియాలో జరుగుతున్న మారణహోమం మానవాళికి మచ్చగా నిలుస్తోంది. అక్కడ జరిగిన తాజా మారణకాండలో చిన్న పిల్లలు మృత్యువాత పడిన తీరు ప్రపంచాన్ని అవాక్కయ్యేలా చేసి కంటతడి పెట్టిస్తోంది. వారు మరణిస్తున్న తీరు హృదయ విదారంగా, అత్యంత దయనీయంగా ఉంది. కనీసం తమ బాధను నోరు విప్పి అరిచేలోపే వారి ప్రాణాలు అనంతవాయువుల్లో కలసిపోయాయి. ఇప్పుడు అక్కడ ఉగ్రమూకలను తుదముట్టించేందుకు ప్రభుత్వ సాయుధ దళాలు విషపూరితమైన కెమికల్ బాంబులను ప్రయోగిస్తున్నాయి. ఇలా చేయడం ఇదే తొలిసారి కాగా, అది కాస్త టార్గెట్ మిస్ అయ్యి జనావాసాలపై షరీన్ కెమికల్ బాంబ్ విరుచుకుపడింది. ఈ బాంబ్ దాడిలో విడుదలయ్యే విషవాయువులు మనుషుల్లోని నాడీకణాలపై దాడి చేసి ఊపిరితిత్తుల కండరాలకు పక్షవాతం కలిగించి 10 నిమిషాల్లో మరణానికి గురిచేస్తాయి. తమకేమైందో తెలుసుకునే లోపే అక్కడి వారు ప్రాణాలు విడుస్తారు. చిన్న పిల్లలు తమ బాధను నోరు విప్పి చెప్పేలోపే వాళ్ళు మృత్యువాత పడ్డారు.
సోషల్ మీడియాలో ఆ వీడియోలు కలకలం రేపాయి. ముద్దులొలికే ఆ చిన్నారులు మృతువాత పడుతుంటే చూసిన వారందరి కడుపు తరుక్కుపోయింది. మానవాళిపై రాను రాను నమ్మకం సడలిపోతుంది. మతాల ముసుగులో ఇంత భీభత్సం సృష్టిస్తుంటే మనం ఏమి చేయలేకపోతున్నామా అనే ఆవేశం కారుమబ్బుల్లా కమ్ముకొస్తుంది. అగ్రదేశాలు ఆడుకునే ఆటలో, నియంతలు పాలించే దేశాలలో మానవ జీవనం ఏ విధంగా మంటగలిసిపోతుందో 'సిరియా'నే ప్రత్యక్ష ఉదాహరణ. ఎవరి స్వార్ధ ప్రయోజనాలు వారివి అయినపుడు, ప్రజలకు పట్టనపుడు, వారికి అధికారము, రాజ్యాలే ఎక్కువైనపుడు, ఇలాంటి దారుణ సంఘటనలు నిత్యం కరాళ నృత్యం చేస్తూంటాయి. అమెరికా-బ్రిటన్ ఇది సిరియా ప్రభుత్వం పనే అంటున్నాయి. రష్యా సైలెంట్ గా వుంది. ఈ పాపం ఎవరిదో అది మానవాళి మొతాన్ని సిగ్గుతో, బాధతో తలదించుకునేలా చేసింది.